దక్షుని యొక్క కుమార్తె దాక్షాయని అని గతంలో వివరించటం జరిగింది. దక్షుడు తన కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. ఒకరోజున బ్రహ్మ ఒక యాగం చెయ్యటానికి ఉపక్రమించి, ఆ యాగానికి దేవతలనందరినీ ఆహ్వానించాడు. అనుకున్నట్లుగానే అందరూ విచ్చేశారు. దక్షప్రజాపతి కొద్ది ఆలస్యంగా వచ్చాడు. అతడు రావటంతోనే దేవతలంతా లేచి నుంచుని ఆయన్ను గౌరవించారు. శివుడు మాత్రం లేవలేదు సరికదా తలత్రిప్పి చూడను కూడా లేదు.
అది అవమానంగా భావించాడు దక్షుడు. తన ఇంటికి మిగిలిన కుమార్తెలను పిలిచేవాడు. కాని సతీదేవిని మాత్రం పిలవటం మానేశాడు. ఈ రకంగా చాలాకాలం గడిచింది. ఒకసారి దక్షుడు యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. దేవతలందరికీ వర్తమానం పంపాడు. కుమార్తెలందరికీ కబురంపాడు. కానీ సతీదేవిని మాత్రం పిలువలేదు. పుట్టింటికి వెళ్ళి చాలాకాలమయింది. సోదరీమణులను చూసి ఎంతో కాలమయింది. తండ్రి యాగం చేస్తున్నాడు. పిలవకపోతే మాత్రం ఏమిటి? వెడదామనుకుంది. భర్తతో అదే మాట చెప్పింది. పిలవకుండా వెళ్ళటం మంచిది కాదు. వద్దు అవమానం పొందవలసి వస్తుంది అన్నాడు భర్త. సతీదేవి వినలేదు. సరే వెళ్ళమని భటులను తోడిచ్చి పంపాడు.
No comments:
Post a Comment