Search This Blog

552. సర్వవ్యాధిప్రశమనీ

సమస్తమైన వ్యాధులను నాశనము చేయునది. అమ్మ తన పిల్లల యొక్క వ్యాధులన్నింటినీ శమింపచేస్తుంది. వ్యాధులు అనేకరకాలు వాటిలో ముఖ్యమైనవి.

1. శారీరకములు
2. మానసికములు

శారీరకములు అంటే శరీరంలో కలిగే మార్పులవల్ల, శీతోష్ణాలవల్ల వచ్చేవి. లేదా పూర్వజన్మల కర్మ ఫలితంగా వచ్చే దీర్ఘవ్యాధులు. జ్వరం దగ్గర నుంచీ అన్నిరకాల వ్యాధులు. వీటిని నాశనం చేస్తుంది. శ్రీ విద్య, బ్రహ్మ విద్య మొదలైనవి సాధన చేసే వారికి కఫ వాత పిత్తాల సమతుల్యత కలుగుతుంది. ప్రాణ శక్తి యొక్క సమృద్ధి కలుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి శారీరిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మానసిక వ్యాధులు - ఇవి శరీరానికి సంబంధించినవి కావు. తన వారు దూరం కావటంవల్లనో, తానుకోరుకున్నది దొరకకపోవటంవల్లనో ఈ రకమైన వ్యాధికలుగుతుంది. ఇది మనసుకు సంబంధించిన వ్యధ. దీనికి వైద్యశాస్త్రంలో మందులేదు. కాని అమ్మ ఈరకమైన వ్యాధిని కూడా నాశనం చెయ్యగలదు. రోగి యొక్క మనసును అమ్మ మీదికి మళ్ళించటమువల్ల ఈ వ్యాధులు ఉపశమిస్తాయి. దీనికి సాంకేతిక పరమైన విశ్లేషణ కూడా ఉంది.

మన మెదడులోని జ్ఞానం అంతా రంధ్రాల రూపంలో ఉంటుంది. సాధారణంగా ఈ రంధ్రాలన్నీ 'నేను', 'నాకు', 'నాది' అనే వాటిని మూలంగా చేసుకుని ఏర్పడతాయి. ఉదాహరణకి

  1. నేను -- అబద్దం ఆడితే ---> నాన్నగారు --కోపం వస్తుంది --> మంచిది కాదు --> నాకు.
  2. నాకు <-- డబ్బులు వస్తాయి <-- ఉద్యోగం చేస్తే --నేను
  3. నేను -- మొక్కుకుంటే --> దేవుడు --వరమిస్తాడు --> నాకు
పైన ఉన్న వాక్యాలను ఉంగరంలా చుడితే అవి 'నాకు', 'నేను' అనే వాటి దగ్గర కలిసి ఒక రంధ్రం ఏర్పడుతుంది. మన ఊహలతో ఇటువంటి కోట్ల రంధ్రాలను తయారు చేసుకుంటాము. ఈ రంధ్రాలే మన నిర్ణయాత్మక శక్తి . మూలపూసలో 'నేను', 'నాకు' ఉండేటటువంటి రంధ్రాలు ఎక్కువయ్యేకొద్దీ స్వార్ధం, దురాశ, అసహనం వంటి భావాలు అధికమయిపోతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ రంధ్రాల వల్ల మనం మరింత బాధకు గురి అవుతాము.

జ్ఞానులు వారి రంధ్రాలను భగంతునితో అనుసంధానం చేస్తారు. వారి రంధ్రాలలో మూల పూసలు 'నేను', 'నాకు' తో కాకుండా 'భగవంతుడి' తో ఉంటాయి. ఉదాహరణకు

  1. భగవంతుడు --సృష్టించాడు--> శరీరాన్ని --పోషణ కొరకు --> అన్నం --ఇచ్చాడు --> భగవంతుడు
  2. భగవంతుడు --రక్షిస్తాడు --> శరీరాన్ని --శరణు వేడుతాను --> భగవంతుడిని
  3. భగవంతుడు --ఇచ్చడు --> తెలివితేటలు -- ఉపయోగిస్తాను --> ధర్మావలంబనకు <--ఇస్తాడు మోక్షం --భగవంతుడు
ఇటువంటి రంధ్రాలు ఉన్న వారికి అనుకూలం ప్రతికూలం అనే ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రంధ్రాలు దేనినైనా సమానంగా స్వీకరించమని ఆదేశిస్తాయి.

జగత్తంతా పరమాత్మ స్వరూపమే. ఈ మానసిక వ్యధ నేను గతంలో చేసిన కర్మల వల్లనే. వాటిని అనుభవించటం వల్ల కర్మక్షయం అవుతుంది అనే భావముతో మనసును అమ్మ మీదికి మళ్ళించటమువల్ల మనసు తేలిక బడుతుంది. ఎందుకంటే ఆ భావన వల్ల రంధ్రాలలో మూలపూసలు కదిలి 'నేను' ఉన్నచోట భగవంతుడు చేరుతాడు. స్వల్పకాలం చేస్తే జపం. దీర్ఘ కాలం చేస్తే తపస్సు. మనం చేసే దాని బట్టి రంధ్రాల మార్పు ఉంటుంది.

Popular